మద్నూర్, బతుకమ్మ: జుక్కల్, మద్నూర్, డోంగ్లి ప్రధాన రహదారి మధ్యన ఉన్న అంతపూర్,తడ్గుర్ వాగులు పొంగిపొర్లయి, అదేవిధంగా దిగువ భాగాన ఉన్న సోమూర్, చిన్న ఎక్లార, లింబూర్, వాడి గ్రామాల మధ్యలో ఉన్న లో లెవెల్ వంతెనల పై నుండి వరద పారడం తో రోడ్లు పాడయి పోయాయి. ఈ ప్రాంతాలను సందర్శించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ… పాడైపోయిన రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మద్నూర్, జుక్కల్, రహదారిలో అంతపూర్ తడ్గుర్ వద్ద వాగు వరద దాటికి పాడైపోయిన రోడ్డును వరద తగ్గి, రోడ్డు రిపేర్ అయ్యేంత వరకు రోడ్డును మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఇంక ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (భారీ వర్షాలు ఉన్నందున) ప్రజలు ఇంటి నుండి బయటకు రావొద్దు అన్నారు. జుక్కల్, మద్నూర్, డోంగ్లి మండలాల మధ్య గ్రామాల మధ్యలో వర్షాలకు వాగులు పొంగి పొర్లు తున్నాయి కాబట్టి ప్రజలు వర్షాలు తగ్గే వరకు మరి ముఖ్యంగా రాత్రి సమయాలలో ప్రజలు ఎవరు ప్రయాణాలు చేయరాదు అన్నారు. సబ్ కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపీడీఓ రాణి, ఎస్సై విజయ్ కొండ, ఆర్ అండ్ బి ఏ ఈ తదితరులు ఉన్నారు.

