. . . పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
బోధన్, బతుకమ్మ :
యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. సరదాగా ప్రారంభమయ్యే అలవాటు వ్యసనంగా మారి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. మత్తు పదార్థాల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు, మానసిక అస్థిరతతో పాటు నేరాల వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా, సహకారం చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా నార్కోటిక్స్, సైబర్ భద్రత, మహిళల రక్షణపై పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి, ట్రెజరర్ కేతం సంతోష్, జాయింట్ సెక్రటరీలు దుష్వంత్, డాక్టర్ శిరీష్, హితిన్ భీమాని, డాక్టర్ ఉషారాణి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొడాలి కిషోర్, సాంబిరెడ్డి, బోధన ఎసిపి శ్రీనివాస్, బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ , బోధన్ రూరల్ సిఐ విజయబాబు, రుద్రూర్ సిఐ, సుమారు 1500 మంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


