కామారెడ్డి బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో కామారెడ్డి పట్టణం రాజకీయ కోలాహలంతో నిండిపోయింది. బుధవారం జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తన ఓటు హక్కును వినియోగించుకొని పౌర బాధ్యతను చాటుకున్నారు. ఉదయాన్నే పట్టణంలోని వార్డు నెంబర్ 49, పోలింగ్ స్టేషన్ నెంబర్ 151 (గంజ్ స్కూల్) కు చేరుకున్న షబ్బీర్ అలీ, ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ఒక సాధారణ పౌరునిలా క్యూలైన్లో నిలబడ్డారు. తన వంతు వచ్చే వరకు వేచి చూసి ఓటు వేయడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పట్టణ ప్రగతిని కాంక్షించే వారు ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వేయాలని, కామారెడ్డి పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లు తమ తీర్పును ఇవ్వాలని, స్థానిక పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. చైతన్యవంతమైన పౌరులు సెలవు దినంగా భావించకుండా, ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు శాతం పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

