నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా (వర్చువల్) ప్రారంభించిన యూనివర్సిటీ నూతన సైన్స్ కళాశాలలోనికి సైన్స్ విభాగాలు నేడు తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.యాదగిరి రావు రిజిస్ట్రార్ ఎం.యాదగిరి తో కలిసి గణపతి పూజ నిర్వహించి కళాశాలలోని అన్ని విభాగాలను పరీక్షించి విభాగాధిపతులకు సూచనలు చేశారు. విద్యార్థులను క్రమశిక్షణతో విద్య అభ్యసించి ఉన్నతులుగా ఎదిగి ఈ ప్రాంతానికి, వారి కుటుంబాలకు పేరు ప్రఖ్యాతలు తెస్తూ భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ గంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంపత్ కుమార్, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ రాంబాబు, సైన్స్ విభాగాలతో పాటు అన్ని విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
