. . . వైస్ ఛాన్స్ లర్ ఆచార్య టి. యాదగిరిరావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ సాధించడం మాత్రమే సరిపోదని, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు అవసరమైన వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు తమలోని సంకోచాలను అధిగమించి ఇంట్రోవర్ట్ స్వభావం నుండి ఎక్స్ట్రోవర్ట్గా మారేందుకు ప్రయత్నించాలని సూచించారు. వ్యక్తిత్వ వికాసం (పర్సనాలిటీ డెవలప్మెంట్), కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్ వంటి అంశాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందగలరని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు ఉపాధి అవకాశాలకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్, సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యాలను నేర్చుకోవడం చాలా అవసరమని ఆయన వివరించారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విధమైన శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థులు ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ పాత నాగరాజు, ప్రొఫెసర్ సి.హెచ్. ఆంజనేయులు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కిరణ్ రాథోడ్, విద్యార్థులు పాల్గొన్నారు.
