నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మన దేశ సుస్థిర నిర్మాణానికి ఎనేలేని సేవలు అందించిన ఉక్కుమనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ, దేశ ప్రజలకు జాతీయ ఐక్యత దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నివాళుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నేతృత్వంలో ఆర్ఆర్ చౌరస్తా శివాజీ విగ్రహం నుండి వర్ని చౌరస్తా వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిటీ నినాదం తో భారీ మార్చ్ నిర్వహించారు. జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ కేవలం ఒక నాయకుడు కాదు.. ఆయన ఒక శక్తి, ఒక సంకల్పం, ఒక ధైర్యస్వరూపం అని కొనియాడారు. దేశం స్వతంత్రం పొందిన వెంటనే 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం చరిత్రలో ఓ అద్భుతం. ఈవి ఏవి బలప్రయోగం ద్వారా కాదు, ఆయన తెలివితేటలు, దౌత్యం, కఠిన నిర్ణయాలు భారతదేశాన్ని ఐక్యంగా నిలిచేలా చేశాయి అని గుర్తుచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, పటేల్ కలల భారత్ సాకారం అవుతోంది. బలమైన నిర్ణయాలు, స్థిర నిబద్ధత ఇవన్నీ పటేల్ స్ఫూర్తి. ఈరోజు మనం సర్దార్ పటేల్ జయంతిని జరుపుకోవడం అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు. భారత ఐక్యతను కాపాడే బాధ్యతను మళ్లీ గుర్తుచేసుకునే రోజు. దేశ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రతి యువకుడు ఆయన స్ఫూర్తిని అనుసరించాలి. పటేల్ త్యాగం, నిబద్ధత తరతరాలకు దిశానిర్దేశం చేస్తాయి అని యువతకు దిశానిర్దేశం చేసారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

