- బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకై ఉద్యమాలే శరణ్యం
- ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్, ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీల జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంలో పాలక పార్టీలకు చిత్తశుద్ధి లేదని అందుకు ప్రత్యక్ష నిదర్శనమే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం అని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్, ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ కామ్రేడ్ మేత్రి రాజశేఖర్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడానికి నిరసిస్తూ నిజామాబాద్ నగరంలో గల అమరవీరుల పార్కులో మహనీయులు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 56% బీసీలు ఉంటే 42% రిజర్వేషన్లు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా జీవో 9 తీసుకువచ్చి పూర్తి చట్టబద్ధ లేకుండా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి న్యాయస్థానంలో నిలబడకుండా చేసిందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఉత్పత్తిలో కీలక భూమిక పోషించే బీసీలకు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలు అగ్రకులాలు చట్టసభలను శాసిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక తరగతులను అణిచివేస్తున్నారని వారికి అండగా పాలక పార్టీలు పనిచేస్తున్నాయని ఈ క్రమంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆ కుట్రలో భాగంగానే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అంటూ కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఇలాంటి బీసీల జనాభా కనుగుణంగా రిజర్వేషన్ల సాధనకై రాజకీయాల కతీతంగా ఉద్యమించడమే ఏకైక శరణ్యమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో బీసీ రిజర్వేషన్లను చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలను సంవత్సరాల తరబడి వాయిదా వేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ స్థానికంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమయ్యే విధంగా చేస్తున్నారని అందుకని తక్షణమే బిసి రిజర్వేషన్ల పై విధించిన హైకోర్టు స్టేను ఎత్తివేయించి స్థానిక ఎన్నికలను నిర్వహించే విధంగా తగిన చర్యలను చేపట్టాలని లేకపోతే ప్రజా ఆగ్రహానికి తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తలగాటి బసవ, భాను, దేవులపల్లి తేజ, పార్టీ మహిళా నాయకురాలు గుర్రం రమాదేవి, బత్తుల కొమరమ్మ, గంధమాల స్వరూప, గడ్డల ఎలీషమ్మ, తాడూరి కరుణ, జగదీశ్వరి, కొమ్ము మాధవి తదితరులు పాల్గొన్నారు.

