ఖుద్వంపూర్లో నిలదీసిన మహిళలు
నందిపేట్, బతుకమ్మ : ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండలంలోని ఖుద్వంపూర్ గ్రామంలో మంగళవారం జరిగిన గ్రామ సభ ఎమ్మెల్యేకు నిరసన చెప్పే వేదికగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామానికి 10 ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆ హామీ నెరవేర్చలేదని గ్రామ మహిళలు మండిపడ్డారు. “మీరు ఎన్నో హామీలు ఇచ్చి గెలిచారు, కానీ ఇప్పటివరకు ఆ హామీలను నెరవేర్చలేదు. మా సమస్యలపై మీ చర్యలు ఏమిటి?” అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధిగా సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే సమావేశం నుంచి వెళ్లిపోవడం గ్రామస్తులను మరింత అసంతృప్తికి గురిచేసింది.
- “గ్రామాలకు రావద్దు” అనే పోస్టర్ల వివాదం మరువక ముందే కొత్త లోల్లి..
ఇంతకుముందు నందిపేట మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను అతికించి, సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యేపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చే వరకు గ్రామాలకు రావద్దని కోరినప్పటికీ రాకేష్ రెడ్డి మంగళవారం ఖుదన్పూర్ గ్రామ సభకు రావడంతో గ్రామస్తులు నేరుగా తమ నిరసనను వ్యక్తం చేశారు. “ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే ప్రజల నమ్మకం కోల్పోతారు. మా సమస్యలను పట్టించుకోని నాయకులను ఎలా నమ్మాలి?” అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రజా ప్రతినిధుల హామీలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజా ప్రతినిధులకు ప్రజల వద్ద రావడం కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు.
