నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ శివాని నృత్య కళాశాల గురువు తాళ్లపల్లి నవనీత గౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో సిరాజ్ డాన్స్,ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారతీయ కళా వైభవం -2025కార్యక్రమంలో నాట్య గురువులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జడ్జి డా.బుర్గుల మధుసుదన్,సరస్వతి ఉపాసకులు దైవజ్క్ శర్మ,ప్రొడ్యూసర్,నటి డా.రాజ కౌశిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ ను చాటుకున్న వారిని ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నవనీత గౌడ్ కు ఉత్తమ నాట్య గురువు పురస్కారం అందుకున్నారు. రవీంధ్రభారతిలో నవనీత గౌడ్ తన శివాని అకాడమి ఆధ్వర్యలో చిన్నారులు భరతనాట్యం, కూచిపూడిలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. నవనీత గౌడ్ శివాని నాట్యమండలిని నెలకొల్పి చిన్నారులకు నృత్యంలో శిక్షణ ఇస్తూ వారిని జిల్లా,రాష్ట్ర స్థాయిలో పోటీలకు పంపి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాగే ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలో చదివే చిన్నారులకు భరత నాట్యం ,కూచి పూడి నృత్యాల తరగతులు నిర్వహిస్తూ చిన్నారులను నృత్యంలో మంచి గుర్తింపు తెస్తున్నారు. నాట్య గురువు నవనీత గౌడ్ ను రాష్ట్ర స్థాయి నాట్య గురువు పురస్కారం దక్కడం పట్ల జిల్లా ప్రజలు,ప్రముఖులు,కళాకారులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
