నిజామాబాద్, బతుకమ్మ : వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ, సీపీఎంఎల్ మాస్ లైన్, ఆర్.ఎస్.పీ, లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకొచ్చేముందు ప్రజల్లో గాని, పార్లమెంట్లో గానీ సమగ్ర చర్చ జరపలేదని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి వీబీ జీ రాంజీ చట్టం తీసుకురావడం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి తగ్గి పేదరికంలోకి నెట్టబడతారని వారు విమర్శించారు. నూతనంగా తెచ్చిన జీవో మూలంగా రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పెరిగి నిధుల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ చట్ట సవరణను ఉపసంహరించుకొని వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించాలని, రోజుకు రూ. 600 కూలీ చెల్లించటానికి కేంద్ర ప్రభుత్వం నిధులను పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అన్వర్, ఆర్ఎస్పీ నాయకులు అనిల్ లిబరేషన్ నాయకులు ఖాజా మొయినుద్దీన్, సీపీఎం నాయకులు పెద్ది వెంకట్ రాములు, వెంకటేష్, అనసూయమ్మ, అనిత, గంగాధర్ డెమోక్రసీ నాయకులు శ్రీధర్, భూమన్న, మల్లికార్జున్, మాస్ లైన్ నాయకులు సుధాకర్, నరేందర్, వెంకన్న ఆర్ఎస్పీ నాయకులు రాములు, నరేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు.
