- పేదోళ్ల ఇండ్లు కూలగొట్టుడు తప్ప కాంగ్రెస్ చేసిందేమి లేదు
- షేక్పేట్ డివిజన్లో ఆశన్నగారి జీవన్ రెడ్డి విస్తృత ప్రచారం
హైదరాబాద్, బతుకమ్మ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బి.ఆర్.ఎస్. పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు షేక్పేట్ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పారామౌంట్ కాలనీలో ఆటో యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో బి.ఆర్.ఎస్. పార్టీలో చేరారు. వారికి జీవన్ రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారందరూ తమ పూర్తి మద్దతు బి.ఆర్.ఎస్. పార్టీకే ఉంటుందని ప్రకటించారు.అనంతరం ఆకీమ్షా కాలనీలో మైనారిటీ సోదరులతో, రిలయన్స్ జూబ్లీ అసోసియేషన్ సభ్యులతో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని ఆదుకున్న ఘనత బి.ఆర్.ఎస్. పార్టీకే దక్కుతుందని వివరించారు.”ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా, ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది” అని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆరు గ్యారంటీలు వంటి హామీలను గాలికొదిలేసి, ఈ రెండు సంవత్సరాల కాలంలోనే ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.బి.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని ‘కారు’ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బి.ఆర్.ఎస్. గెలుపుతోనే అభివృద్ధి పనులు తిరిగి వేగవంతమవుతాయని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

