సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం
కోట్ల మంది త్యాగాలతో స్వాతంత్య్రం
అణుబాంబుల పేరిట బ్లాక్మెయిల్కు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం
ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
ఢిల్లీ, బతుకమ్మ : సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీ లోని ఎర్రకోటపై 12వ సారి జాతీయ జెండాను మోదీ ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కోట్ల మంది త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇది 140 కోట్ల మంది సంకల్ప పండుగ అన్నారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం అన్నారు. ఆపరేషన్ సిందూర్ హీరోలకు సెల్యూట్ అని, మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారని, పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. పహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారని అన్నారు.. భార్య ముందే భర్తను, పిల్లల ముందే తండ్రిని చంపేశారన్నారు.. పాక్ ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరీ మారణహోమం సృష్టించారన్నారు. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామన్నారు. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని, పాక్లోకి చొచ్చుకెళ్లి మరీ మన జవాన్లు ముష్కరులను మట్టుబెట్టారన్నారు. మన సైన్యం ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందన్నారు. ఉగ్రవాదులను, వారికి మద్ధతిచ్చేవారిని మేం వేర్వేరుగా చూడటంలేదన్నారు. అణుబాంబు బెదిరింపులను సహించేదిలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. ఇకపై ఎవరి బ్లాక్మెయిల్ నడవదని, బ్లాక్మెయిల్కు పాల్పడితే ధీటుగా జవాబిస్తామన్నారు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవని స్పష్టం చేశారు. సింధూ జలాల ఒప్పందంపై ఎప్పటికీ చర్చల ప్రసక్తి లేదన్నారు. వాటిని నీటి కొరత భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు ఉండదన్నారు. సింధూ జలాలపై సంపూర్ణ అధికారం భారత్ ది, భారత్ రైతులదే అని స్పష్టం చేశారు.
యువత కోసం రూ. లక్ష కోట్లతో నూతన పథకం
దేశ యువత కోసం రూ. లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన కింద అమలు చేయనున్నామని చెప్పారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరపున నెలకు రూ.15 వేలు అందించనున్నట్లు చెప్పారు.
విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఎందుకు ఆధారపడాలి..?
సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వైపు దేశ యువత దృష్టిపెట్టాలని సూచించారు. విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఎందుకు ఆధారపడాలని ప్రశ్నించారు. యువత శక్తి, సామర్థ్యాలపై నమ్మకం ఉందన్నారు. ఫైటర్ జెట్లకు మేడిన్ ఇండియా ఇంజిన్లపై దృష్టిపెడతామన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. 10 కొత్త అణు రియాక్టర్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.. త్వరలో మేడిన్ ఇండియాచిప్స్ మార్కెట్లో రాజ్యమేలుతాయన్నారు. డీజిల్, పెట్రోల్ దిగుమతులపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలన్నది లక్ష్యమన్నారు.
దీపావళికి దేశ ప్రజలకు బహుమతి
దీపావళికి దేశ ప్రజలకు బహుమతి ఇవ్వబోతున్నామన్నారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టబోతున్నామన్నారు. దీంతో వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి.. దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందన్నారు.


