. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభ్యర్థులంతా ఐక్యంగా పనిచేస్తే ఇందూర్లో ఘన విజయం ఖాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఇందూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాలంలో నగర అభివృద్ధి కోసం సుమారు రూ.130 కోట్ల నిధులను తీసుకురావడం జరిగిందని, ఇటీవలి కాలంలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా ప్రతి డివిజన్కు రూ.1 కోటి చొప్పున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశానన్నారు. డివిజన్ కి కోటి రూపాయల నిధులతో సమగ్ర అభివృద్ధి పనులు జరగబోతున్నాయన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగించబోతున్నామని తెలిపారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా రూ.23 కోట్లతో నిధులు మంజూరు చేయించడం జరిగిందని, రానున్న ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీదేనని ధీమా వ్యక్తం చేసారు. ఇందూర్ నగరంలో నిర్వహించిన అన్ని సర్వేలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందూర్ ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలనకు మద్దతుగా నిలుస్తున్నారని, అందుకే “మన ఇందూర్ మన మేయర్ ” అన్న నినాదం ప్రజల్లో నిజమై నిలుస్తోందని తెలిపారు. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ఇది ఇందూర్ ప్రజల మనసులోని వాస్తవ స్వరం అని పేర్కొన్నారు. రేపటి నుండి పూర్తిస్థాయిలో ర్యాలీలు, ఇంటింటి ప్రచారం ద్వారా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయనన్నారు.
