బతుకమ్మ, బోధన్: నిజాంసాగర్ గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరిగి బోధన్ మండలంలోని ఖండ్గావ్ గ్రామం జలదిగ్బంధానికి గురైంది. రహదారులు పూర్తిగా మూసుకుపోవడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోగా, మోటార్లు, వ్యవసాయ పరికరాలు వరదలో కొట్టుకుపోతున్నాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు ఆలస్యంగా రావడంతో ఏమీ కాపాడుకోలేకపోయామని రైతులు బాధ వ్యక్తం చేశారు. గ్రామంలోని కొండలవాడి బ్రిడ్జి వరద నీటిలో మునిగిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఇటీవలి వర్షాల ప్రభావంతో ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినడంతో, మంచినీటి కోసం ప్రజలు బెక్నెల్లీ శివారునుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అయితే, వరద తీవ్రత కారణంగా అది కూడా కష్టసాధ్యమవుతోంది. ప్రభుత్వం తక్షణమే సహాయ చర్యలు చేపట్టి, నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలని, మంచినీటి వసతి కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

