నిజామాబాద్, బతుకమ్మ : 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్ లోని యూపిఎస్ పాఠశాలను, బస్తీ దావఖానను మంగళవారం అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు యూపీఎస్ పాఠశాలలో ఆరు మంది ఉపాధ్యాయులు ఉన్న, మౌలిక సౌకర్యాలు అన్ని ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య 40 మాత్రమే ఉందని సరైన విద్య అందించకపోవడమే కారణమని అన్నారు. విద్యా సంవత్సరం మొదలై ఏడు నెలలు పూర్తి కావొస్తున్న మిర్చి కాంపౌండ్ లోని యూపీఎస్, ఉర్దూ పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రాథమిక దశలోనే ఉందని మండిపడ్డారు. ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు గత నాలుగు రోజుల నుండి రావడం లేదని ఆమెకు బదులు వేరే టీచర్ ని పెట్టి నడిపిస్తు పాఠశాలకు రాని విద్యార్థులు వచ్చినట్లు రిజిస్టర్ లో హాజరు వేయడం పై మండిపడ్డారు. జిల్లా విద్యశాఖ అధికారితో వెంటనే మాట్లాడి ఉర్దూ టీచర్ పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే విద్యసంవత్సరానికి మిర్చి కాంపౌండ్ పాఠశాలను మోడల్ స్కూల్ గా తీర్చి దిద్దేల చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉపాధ్యాయులు చిత్త శుద్ధితో విద్యార్థులకు విద్యా బుద్దులు సకాలంలో నేర్పించి ఉన్నత విద్యార్థులుగా తీర్చి దిద్దాలని, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివిపించే విధంగా తల్లితండ్రుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. బస్తీ దావఖానాలో సకల వసతులు ఉన్నప్పటికీ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బస్తీ ప్రజలకు వైద్యం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రిజిస్టర్ లో మాత్రం రోజు 70 నుండి 80 మంది వస్తున్నట్లు రికార్డు మెయింటైన్ చేస్తున్న అందులో స్వయంగా ఒక ఇద్దరికీ కాల్ చేసి ఎమ్మెల్యే మాట్లాడగా వారు నిజామాబాదు వాసులం కాదు అని జవాబు ఇవ్వడం జరిగిందన్నారు. దావఖానకు వచ్చే రోగులను కనీసం పట్టించుకోకుండా, మందులు ఇవ్వకుండా, ఎటువంటి చెక్ అప్ లు నిర్వహించకుండ తమ విధులను నిర్లక్ష్యం చేస్తున్న దావఖాన సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య అధికారి డీఎం అండ్ హెచ్ఓ ని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ ను సందర్శించారు. అలాగే డివిజన్ లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ కార్పొరేటర్ కల్పన మల్లేష్ గుప్తా, డివిజన్ బీజేపీ నాయకులు పవన్ ముందడ, (పండు) బంటు ప్రవీణ్, తారక్ వేణు, వనిత, సురేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
