. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు
బోధన్, బతుకమ్మ :
బోధన్లోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడంతో పాటు అవసరమైన వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు శనివారం సిపిఎం నాయకులు జిల్లా ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ముందుగా ఆస్పత్రి వైద్యులతో సమావేశమై సమస్యలపై చర్చించిన నాయకులు, అనంతరం వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసినప్పటికీ, కనీసం ఏరియా ఆస్పత్రిలో ఉండాల్సిన స్థాయిలో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో లేరని ఆరోపించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం రోగులను ప్రైవేట్ ఆస్పత్రులు లేదా జిల్లా కేంద్ర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలకు సేవలందించేందుకు గైనకాలజిస్టులు లేరని, ఎముకల వైద్యులు, స్కానింగ్ నిర్వహించేందుకు టెక్నీషియన్లు కూడా అందుబాటులో లేరని పేర్కొన్నారు. దీంతో అనేక మంది రోగులకు ప్రాథమిక మందులు ఇచ్చి పంపించాల్సిన పరిస్థితి నెలకొందని, అనంతరం వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదాలో ఉన్న సుదర్శన్ రెడ్డి జిల్లా ఆస్పత్రిలో అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో, వైద్య సిబ్బందిని నియమించడంలో తగిన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లా ఆస్పత్రి స్థాయికి తగిన విధంగా వైద్యులు, సిబ్బంది, టెక్నీషియన్లు, అవసర మైన మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు వేషాల గంగాధర్, జంగం గంగాధర్, నాయకులు రాములు, నాగలక్ష్మి, అర్జున్ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

