బాన్సువాడ, బతుకమ్మ :
వనమహోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని చెరువు పరిసర ప్రాంతంలో ఈత మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎక్సైజ్ సీఐ దిలీప్ ముఖ్య అతిథిగా హాజరై ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ దిలీప్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని అన్నారు. ముఖ్యంగా ఈత మొక్కలు భూమిలో తేమను కాపాడటంతో పాటు పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భావితరాలకు పచ్చని ప్రకృతిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రావణ్ కుమార్, గ్రామ సర్పంచ్ ఉమా, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, ఎంపీడీఓ సరిత, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కిషోర్ యాదవ్, మాజీ సర్పంచ్ నారా గౌడ్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
