. . . పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే పోస్టర్ ఆవిష్కరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పర్యావరణ సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అన్నారు. ఈ నెల 22 న ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను మంగళవారం అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. పోస్టర్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ముఖ్య అంశాలు, సందేశాలు, అలాగే సేంద్రీయ ఎరువుల వినియోగం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వంటి సూచనలు ప్రతిబింబించబడ్డాయి. ఈ పోస్టర్ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల వద్ద ప్రదర్శించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా సైన్స్ అధికారి కే.గంగా కిషన్, డీఎస్పీ ఈగల్ – ఎం.సోమనాథం, డీఐఈవో రవి కుమార్, డా. రవి తేజ సైకియాట్రిస్ట్, బి.సంజయ్ గౌడ్ ఎఫ్ ఆర్ వో, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
