. . . వెయ్యేళ్ళయిన బీఆర్ఎస్ మారదు
. . . సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన గుంటనక్కతో డీల్ మాట్లాడుకున్నారా ?
. . . తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు
. . . తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్రంలో అధికార ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు భారీ బహిరంగ సభలు పెట్టి బలప్రదర్శనకు దిగి బీఆర్ఎస్ ఉట్టి కథలు చెబితే. . . కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ లో కవిత విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ లను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది. వెయ్యేళ్ళయినా బీఆర్ఎస్ పార్టీ మారదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమికి ఇప్పటికి ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని అన్నారు. ప్రజలే తప్పు చేశారని వారిని చులకన చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాలు కురువృద్ధుడిని చేర్చుకుని ఆయనకే 25 ఏళ్ళు తగ్గిపోయిన నవయువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏమిటని అన్నారు.

జగిత్యాల సభలో 75 ఏళ్ల కురువృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని.. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగాణ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తున్నారంటే వెయ్యేండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదని తేల్చిచెప్పారు. మేధావులు, విద్యావేత్తలు బీఆర్ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం రెండు సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలు తెలంగాణ ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి.. ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. జగిత్యాల సభలో తెలంగాణ కోసం ఉరిమే ఉత్సాహంతో పోరాడిన ఉద్యమకారుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన చేసే దుస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు.

జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్ సభలో మహిళా బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక్కమాట మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. తమ ఓటమికి ప్రజలకే కారణమని ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు. గుంట నక్క ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని గుంపుమేస్త్రీ అంటున్నారని.. ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి బీఆర్ఎస్ నాయకుడు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సీఎం మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసేలా సీఎం మాట్లాడారని అన్నారు. కోర్టులపై తనకు గౌరవం ఉందని, కానీ ఫలానా కేసులో ఇలాంటి తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటని నిలదీశారు. ఢిల్లీలో గుంటనక్క ఎవరిని కలిశారో చెప్పాలా అంటూ ఆయనతో సీఎం డీల్ మాట్లాడుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో, ఎవరు పాలకపక్షంలో ఉండాలో డిసైడ్ చేయాల్సింది ప్రజలు కదా అని ప్రశ్నించారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని ఎలా చెప్తారని.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు రెండోసారి ఓట్లేస్తారని ప్రశ్నించారు. సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సగం మందికి రైతుభరోసా ఇవ్వలేదని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేస్తున్నారని, కుమ్మెర జాతరలో రెండు నెలల పాప చనిపోయినా మాట్లాడలేదని.. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారని మీరు మళ్లీ అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజల విషయంలో ఏ లెక్కలేని తనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేని తనం కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది.. ఆర్టీసీలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని కవిత అన్నారు.

