వరంగల్, బతుకమ్మ : తొమ్మిది రోజల బతుకమ్మ పండుగలో భాగంగా ఆదివారం తొలిరోజు ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో హనుమకొండ వేయి స్తంభాల ఆలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కావ్య, పలువురు ఎమ్మెల్యేలు హాజరై ఈ బతుకమ్మ కార్నివాల్ను ప్రారంభించారు. బతుకమ్మ పాటలు, జానపద నృత్యాలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. మంత్రులు కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ పాట పాడి ఆకట్టుకున్నారు. పూలనే దైవంగా భావించే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని వారు పేర్కొన్నారు.


