
నిజామాబాద్, బతుకమ్మ: పచ్చి పసుపును మార్కెట్ యార్డుకు తీసుకురావొద్దని, పూర్తిగా ఆరిన తరువాత తీసుకువస్తే రైతులు లాభాలు పొందొచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. పసుపు సాగు చేసిన రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార యాత్ర వాహనాలను భూపతిరెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ – నామ్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. పచ్చి పసుపునకు సరైన ధర వచ్చే అవకాశం ఉండదని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ బదావత్ తారాచంద్ నాయక్, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిశోర్, మల్లేశ్, మాస్టర్ శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి, నర్సాగౌడ్, మార్కెట్ కమిటీ అధకారులు, సిబ్బంది పాల్గొన్నారు.