. . . ఇరిగేషన్ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని బీజేపీ నాయకుల వినతి..
రుద్రూర్, బతుకమ్మ :
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగుకు సాగునీటి సరఫరా, రైతు సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ఇరిగేషన్ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరుతూ రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయికి మంగళవారం బీజేపీ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల రుద్రూర్ మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే వేల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేయగా, వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టుల నుండి సాగునీరు సక్రమంగా అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా బాన్సువాడ నియోజకవర్గంలో అన్ని మండల ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే పెట్టుబడి పెట్టి రెండోసారి నాట్లు వేసినప్పటికీ, నీటి లభ్యత లేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. మండలంలో చాలాచోట్ల రైతులు బోర్లపై ఆధారపడి వరి సాగు చేస్తున్నారు. అయితే, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు ఎండిపోతున్నాయని, దానికి తోడు సరైన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల రైతులు పంటలను కాపాడుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సాగునీటి నిర్వహణపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఆదుకునే దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కావున, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్ శాఖాధికారులతో తక్షణమే అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 6.5 టీఎంసీల నుండి, సాగునీటిని ఏ మేరకు, ఎప్పటి నుండి విడుదల చేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలన్నారు. పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో అంచనా వేసి, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ కార్యాచరణను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందకుండా వారిని ఆదుకునేలా మీరు ప్రత్యేక చొరవ చూపాలని భారతీయ జనతా పార్టీ తరపున కోరారు. తక్షణమే స్పందించి రైతులకు భరోసా కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరి ప్రశాంత్ గౌడ్, బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటిహరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, మండల సీనియర్ నాయకులు బీవీ గుప్తా, చిదుర మహిపాల్, వినయ్, గంగారాం, కార్యదర్శి ఎర్రోళ్ల శంకర్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
