నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలు వస్తున్న సందర్భంగా బోధన్ డివిజన్ పరిధిలో గల రెంజల్ మండలం లోని కందకుర్తి గోదావరి బ్రిడ్జి, పుష్కర ఘాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు. ఆయన వెంట బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్ఐ కె. చంద్ర మోహన్, మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్ ఏఈఓ గోపి కృష్ణ తదితరులు ఉన్నారు.

