నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు
నిజామాబాద్, బతుకమ్మ : డీఎస్సీ -2024లో ఎంపికైన ఉపాధ్యాయులకు మంగళవారం కౌన్సిలింగ్ జరిగింది. నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టరేట్ లో కామారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు స్థానిక కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ జరిగింది. మంగళవారం ఉదయం కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యం కారణంగా మధ్యాహ్నం 3 గంటల వరకు కౌన్సిలింగ్ వాయిదా వేశారు. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ లను ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో 464 పోస్టులకు ఎంపికైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్ మెంట్ లెటర్ ను అందజేశారు. 137 పోస్టులను ఇంకా భర్తీ చేయలేదు. మధ్యాహ్నం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. కౌన్సిలింగ్ ఆలస్యానికి కారణమైంది. ఎంపికైన అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన జాబితా ప్రకారం పోస్టింగ్ లు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్, కామారెడ్డి జిల్లాలో డిఈవో రాజులు డీఎస్సీ -2024లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. వివిధ కారణాలతో ఉద్యోగులకు ఎంపిక ఆర్డర్లు వచ్చినా కౌన్సిలింగ్ లో పేర్లు రాని అభ్యర్థుల వినతులను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు పంపించారు.

