- మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే
బతుకమ్మ: బిచ్కుంద : వారం రోజులుగా కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. డోంగ్లి మండలంలో పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు వెంటనే పంట నష్టం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టం అందించాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతుబంధును అందించేవారని, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయ ప్రజలకు మాటలు చెప్పి.. గద్దెనెక్కి రైతులను విస్మరించిందని మండిపడ్డారు. రైతులకు అందించాల్సిన రైతుబంధును నాలుగు సీజన్లకు గాను ప్రతి ఎకరాకు 30 వేల రూపాయలను అందించాల్సి ఉండగా 11 వేల రూపాయలని అందించిందని, మిగతా ప్రతి ఎకరాకు19వేల రూపాయలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని, రుణపడి ఉన్న రైతుబంధు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టపరిహారాన్ని కూడా వెంటనే రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.గత నాలుగు రోజుల క్రితం కురిసిన నియోజకవర్గంలోని నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టులలో ఎగువ నుండి వరద నీరు వచ్చి చేరడంతో నిజాంసాగర్, కౌలాస్ నాల వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో బిచ్కుంద మండలంలోని శేట్లూరు గ్రామంలో ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతు తో పాటు 656 గొర్రెలను ప్రాణాలతో పాటు రక్షించిన అధికారులకు, రెస్క్యూ టీం సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తో పాటు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

