వెబ్ న్యూస్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఈలేఖలో తెలంగాణలో చెక్ డ్యామ్ లు కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కట్టిన చెక్ డ్యామ్ లు కూలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కమీషన్లకు కక్కుర్తిపడి నాణ్యతను గాలికి వదిలేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం, నిధుల చెల్లింపులపై ఆదేశించిన విజిలెన్స్ విచారణ ఏమైందని ప్రశ్నించారు? ఆనాడే బాధ్యులపై చర్యలు తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉంటే తనుగుల-గుంపుల చెక్ డ్యామ్ కూలేది కాదని పేర్కొన్నారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చెక్ డ్యామ్ ల నిర్మాణాల్లో అక్రమాలు, కూలిపోవడంపై విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల ఆస్తులను జప్తు చేసి ఆ సొమ్ముతో మళ్లీ చెక్ డ్యామ్ లను నిర్మించాలని తన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.


