- తొలి బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ
- హైదరాబాదులో ప్రారంభమైన ఆషాఢమాస బోనాలు
హైదరాబాద్, బతుకమ్మ : అమ్మకు బోనం… తల్లికి బోనం అంటూ ఆషాఢమాస బోనాలు షురూ అయ్యాయి. బోనాల సంబరాలు అంబరాన్ని అంటాయి. తొలి బోనాన్ని, పట్టు వస్త్రాలను అమ్మకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అందజేశారు. పోతురాజుల విన్యాసాలు అబ్బురపరిచాయి. భక్తిశ్రద్ధలతో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… ఆషాఢ బోనాలు సంస్కృతీ, సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. జగదాంబ అమ్మవారి ఆశీర్వాదాలు తెలంగాణ ప్రజలపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. శ్రీ శ్రీ శ్రీ జగదాంబ మహంకాళి గోల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సభాపతి ప్రసాద్ కుమార్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లతో కలసి పాల్గొన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుండి జంట నగరాల్లో వైభవోపేతంగా బోనాల సాంప్రదాయం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ జంట నగరాల్లో నిర్వహించే బోనాల నిర్వహణకు రూ. 20 కోట్ల రూపాయలు కేటాయించి, ముందుగానే అందజేశారని వివరించారు. గోల్కొండ బోనాలకు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉందన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి బోనాల పండుగ ప్రాముఖ్యత పట్ల హైదరాబాద్ మహానగరానికి ప్రజలు, భక్తులు తరలివస్తున్నారన్నారు. అమ్మవారికి తొలి బోనం సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అలాగే ప్రభుత్వం ఈ బోనాల నిర్వహణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అమ్మవారికి సమర్పించే బోనాలలో భక్తులకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులు ఆదేశించినట్టు చెప్పారు. నెలరోజుల పాటు బోనాల నిర్వహణ కార్యక్రమం నిర్వహణ సందర్భంగా ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాటు చేశామన్నారు. ఈ బోనాల కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామాయ్యర్, కమిషనర్ వెంకటరావు, హైదరాబాద్ సీపీ ఆనంద్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిబాబు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
