. . . మార్కెట్ యార్డును సందర్శించిన పోలీసు కమిషనర్
. . . మార్కెట్లో క్రయవిక్రయదారులతో మాటముచ్చట
. . . రైతుల ఉత్పత్తుల రక్షణకు 24 గంటల నిఘా అవసరం
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల పంటలకు రక్షణ లేదని బతుకమ్మలో వస్తున్న వరుస కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. గడిచిన వారం నుంచి యార్డులో రైతులకు సంబంధించిన పసుపు దొంగతనాలు వరుసగా జరుగడం, వాటిని కార్మికులు వారి వెనుక కమిషన్ ఏజంట్లే గేటు బయటకు తరలించి విక్రయాలు చేస్తున్నారని మూడు రోజులుగా బతుకమ్మలో వచ్చిన కథనంపై పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది. బుధవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును పోలీసు కమిషనర్ సాయిచైతన్య సందర్శించారు. మార్కెట్ యార్డ్ లో పసుపు విక్రయదారులతో ముచ్చటించారు. మార్కెట్ యార్డ్ లో వారికి గల సదుపాయాలు గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మార్కెట్ యార్డులో ఎలాంటి గొడవలు , వివాదాలు లేకుండా వ్యాపారం జరగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ శాంతిభద్రతలను కాపాడడానికి కృషి చేయాలని తెలిపారు. తప్పుడు తూకాలు, మధ్యవర్తుల మోసాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డ్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలు తగ్గించే విధంగా సహకరించాలని కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అన్ని గేట్ల వద్ద 24 గంటల పాటు నిఘా ఉంచాలని, అనుమతి లేని వారిని ఎవరిని అనుమతించకూడదని సూచించారు. భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అవసరమని సూచించారు. ఏదైనా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
