నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరచిన అంజిరెడ్డి, మల్క కొమురయ్యలను అధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్ లో జరిగిన ఉమ్మడి ఇందూర్ కరీంనగర్, అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం బుధవారం బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, తెలంగాణ సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ , నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావిత ఓటర్లను గుర్తించి వారితో వ్యక్తిగతంగా పరిచయం పెంచుకోవాలన్నారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలుసుకుని అభ్యర్థి గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతున్నాయని ఓటర్లకు తెలియజేయాలన్నారు. ఢిల్లీలో మొదలైన విజయం, గల్లీలో కాషాయ జెండా ఎగురావేసే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అవిశ్రాంతంగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుత ఎన్నికలు అంజిరెడ్డి కి,కొమురయ్య కి చెందినవి కావని, ఈ ఎన్నికలు ప్రతి బీజేపీ కార్యకర్త భవిష్యత్కు పునాది వేసే ఎన్నికలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి బలమైన స్థానం ఏర్పడుతుందన్నారు. ఈ ఎన్నికలో మనం విజయపథాన్ని అందుకోవాలంటే, ప్రతి కార్యకర్త కర్తవ్యభోదంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పల్లె గంగారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు తదితరులు పాల్గొన్నారు.

