. రూ.10కోట్లు చెల్లించకుండా పరార్
. బాధితుల్లో ఎక్కువ మంది మోర్తాడ్ కు చెందిన రైతులే..
. ఐపీ పెట్టడంతో పసుపు రైతుల లబోదిబో
. లెక్కల బుక్కులతో సహా ఉడాయింపు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ (శ్రద్ధానంధ్ గంజ్)లో ఓ కమీషన్ ఏజెంట్ బోర్డు తిప్పేశాడు. ఈ ఘటన అలస్యంగా వెలుగు చూసింది. గంజ్ లో కమీషన్ ఏజెంట్ (అడ్తి దుకాణం)గా కొన్నేళ్లుగా కార్యకలాపాలు నిర్వహించే ట్రేడర్ రాత్రికి రాత్రే ఉడాయించాడు. దీంతో ఆ వ్యాపారికి పసుపు విక్రయించిన రైతులు లబోదిబోమంటున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది మోర్తాడ్ మండలానికి చెందిన రైతులతోపాటు పలువురు వ్యాపారులు ఉన్నట్లు తెలిసింది. సదరు వ్యాపారి ఐపీ కూడా పెట్టడంతో తమ డబ్బులు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. గత సీజన్ కు సంబంధించిన పసుపును రైతుల నుంచి తీసుకుని కమీషన్ పై దందా చేసిన సదరు ఏజెంట్ వాటికి సంబంధించిన లెక్కల పుస్తకాలతో సహా రాత్రికిరాత్రే బిచానా ఎత్తేయడం మార్కెట్ లో చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లాతోపాటు జగిత్యాల జిల్లా కు చెందిన రైతులు సదరు ట్రేడర్ కు పసుపును ఇచ్చినట్లు సమాచారం. రైతుకు చెల్లించాల్సిన డబ్బులు సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో రైతులకు టోపీ పెట్టిన ఘటన జరగలేదు. కోట్ల రూపాయలను కమీషన్ ఏజెంట్ ముంచిన విషయం ఇప్పటికీ చాలమంది రైతులకు తెలియకపోవడానికి సబ్ ఏజెంట్టే కారణమని తెలిసింది. అయితే సంబంధిత కమిషన్ ఏజెంట్ కార్యకలాపాలు నిర్వహించే దుకాణం తెరిచి ఉండగా.. ఈ వ్యవహారంపై దుకాణంలో పనిచేసే వారిని వివరణ కోరగా.. తమ యజమాని అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పడం గమనార్హం. అక్కడ ఉన్న ఇతర వ్యాపారులు మాత్రం పసుపు రైతులతోపాటు ఇతరులకు ఐపీ నోటీసులు వచ్చాయని చెబుతున్నారు. ఈ విషయమై వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులను వివరణ కోరగా.. తమకు సమాచారం లేదని తెలిపారు. ప్రతి సీజన్ లో ఏవరో ఒక వ్యాపారి వ్యవహారం వివాదాస్పదమవుతూనే ఉంది. దళారులను నమ్మి మోసపోబద్దని, నేరుగా వచ్చి ఈ – నామ్ ద్వారా పంట దిగుబడిని విక్రయించాలని రైతులకు వ్యవసాయ మార్కెట్ అధికారులు చేస్తున్న వినతులను రైతులు పెడచెవిన పెట్టి మూల్యం చెల్లించుకుంటున్నారు.
