. . . రెండోసారి మండల అధ్యక్ష బాధ్యతలు
ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవంగా నిర్వహించారు. తడపాకల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బి. కృష్ణ ప్రసాద్ను వరుసగా రెండోసారి పీఆర్టీయూ ఏర్గట్ల మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–2028 కాలానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అనంతరం ఎన్నికల అధికారులు నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయించి, నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గంలో మండల ప్రధాన కార్యదర్శిగా డి. ప్రవీణ్ శర్మ, అసోసియేట్ అధ్యక్షుడిగా మైసాల సుధాకర్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా ఏ. మమత, ఉపాధ్యక్షుడిగా ఇమాముద్దీన్, మహిళా ఉపాధ్యక్షురాలిగా టి. స్వప్న, కార్యదర్శిగా ఏ. వరుణ్, మహిళా కార్యదర్శిగా ఎస్. మౌనిక ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని, ప్రతి ఉపాధ్యాయుడికి సంఘం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ ఎన్నిక సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, జిల్లా మాజీ అధ్యక్షుడు తుమ్మల లక్ష్మణ్ పటేల్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శులు ఎం. వెంకటేశ్వర్ గౌడ్, పెంట జలంధర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గోపిడి రవీందర్ రెడ్డి, ఏర్గట్ల మండల అసోసియేట్ అధ్యక్షులు గటాడి భాస్కర్, మగ్గిడి ప్రవీణ్, దశేందర్ తదితరులు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

