. . . అత్యవసర సమయం లో రక్త దానం
కామారెడ్డి, బతుకమ్మ :
అత్యవసర పరిస్థితిలో సకాలంలో రక్తదానం చేసి ఓ మహిళకు ప్రాణదాతగా నిలిచారు రిజర్వ్ ఎస్ఐ సాయి ప్రసన్న. ఆయన చేసిన సేవపై ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అభినందనలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇందిర (22) అనే మహిళకు శస్త్రచికిత్స కోసం అత్యవసరంగా ఓ నెగెటివ్ రక్తం అవసరమైంది. అయితే జిల్లా రక్తనిధి కేంద్రాల్లో ఆ గ్రూప్ రక్తం అందుబాటులో లేకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు డాక్టర్ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించిన డాక్టర్ బాలు, రిజర్వ్ ఎస్ఐ సాయి ప్రసన్నను సంప్రదించగా, ఆయన ఆలస్యం చేయకుండా రెయిన్బో బ్లడ్ బ్యాంక్లో ఓ నెగెటివ్ రక్తాన్ని దానం చేసి మహిళకు అవసరమైన రక్తాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తూనే అత్యవసర సమయంలో రక్తదానం చేసి మహిళ ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన సాయి ప్రసన్న సేవాభావం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సైఫ్, బట్టు భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

