. . . బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నందిపేట్ మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ అన్నారు. ఈ మేరకు జాతీయ బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు శనివారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో ఇంచార్జ్ సూపరిండెంట్ దీపక్ను కలిసి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రైవేట్ పాఠశాలలు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు లేకుండానే నిర్వహించబడుతున్నాయని ఆరోపించారు. పాఠశాలలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినప్పటికీ, సంబంధిత షిఫ్టింగ్ అనుమతులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నందిపేట్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కూడా సరైన షిఫ్టింగ్ అనుమతి, ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ లేకుండానే నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా, పాఠశాల బస్సుల్లో విద్యార్థులను నిర్ణీత సామర్థ్యానికి మించి తరలిస్తున్నప్పటికీ విద్యాశాఖ, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నందిపేట్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయానికి మెమోరాండం అందజేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

