మెదక్, బతుకమ్మ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మంజీర మహోగ్ర రూపం దాల్చింది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి దిగువకు 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వద్ద మంజీర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలయం మూసి ఉంచడంతో. రాజగోపురంలో వనదుర్గా భవానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మంజీర ఉధృతికి దుర్గమ్మ ఆలయం సమీపంలోని ప్రసాదాల షెడ్డు కొట్టుకుపోయింది. ఆలయం పైకప్పుని తాకి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. ఆలయానికి వచ్చే రెండు మార్గాలను అధికారులు మూసి వేశారు. ఆలయం వద్దకు ఎవరు రావొద్దని సూచించారు. రాజగోపురం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి నది వైపు భక్తులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అలాగే మెదక్ జిల్లాలోని ఎల్లాపూర్ గ్రామ శివారులో మంజీర నది ఉధ్రుతంగా ప్రవహిస్తోంది. దీంతో మంబోజిపల్లి – ఎల్లాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు, వాహనాలు మంజీర పరివాహక ప్రాంతం వైపు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
