నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు సోమవారం పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పోచారం, ఘనపూర్ ల నుండి భారీగా వరద నీరు రావడంతో నిజాంసాగర్ నుండి గేట్లు ఎత్తి నీరు మంజీరా నదిలోకి వదలడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టును, గేట్లను, కాలువలను స్థానిక, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజనీర్లతో ప్రాజెక్టు సంబంధించిన రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రాజెక్టు పటిష్టంగా ఉందని ఎటువంటి ఇబ్బంది లేదని

ఇంజనీర్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిండినది, వానాకాలం, యసంగి పంటలకు ఇబ్బంది లేకుండా సాగు నీరు అందించవచ్చని తెలిపారు. రైతులు సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రాజెక్టు పటిష్టంగా, సురక్షితంగా ఉందని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మంజీరా నది లోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసే క్రమంలో మంజీరా నది పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.

