- మెండోరాలో వరద పాశం సమర్పణ
- భీమ్ గల్, బతుకమ్మ
మండలంలోని మెండోరా గ్రామ ప్రజలు వర్షాలు కురవాలని, వరుణ దేవుని కరుణ కోసం ఐదు రోజులుగా గ్రామ దేవతలకు గంగ జలంతో అభిషేకం చేసి, ఘనంగా కప్పతల్లి పూజలు నిర్వహించారు. మెండోరా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజులు నిర్వహించిన కప్పతల్లి పూజలను ఆదివారం ముగింపు నిర్వహించి శాస్త్ర బద్దంగా గంగమ్మ దేవతలకు వరద పాశంను సమర్పించారు. తొలి రోజు నుంచి గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు కప్పతల్లులను తీసుకెళ్లి జలాభిషేకం చేయించి భక్తులు సమర్పించిన బియ్యాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సేకరించారు. భక్తులు సమర్పించిన బియ్యంతో నైవేద్యం కొరకు భారీ పాత్రలో పాయసం (పాశం) తయారు చేశారు. తయారుచేసిన పాషాన్ని వరద పాశం పేరుతో గంగమ్మ తల్లికి సమర్పించారు. ఐదు రోజుల క్రితం తడపాకల గోదావరి నుంచి ప్రత్యేకంగా గోదావరి జలాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తీసుకువచ్చారు. అనంతరం కప్పలకు కళ్యాణం చేసి ఐదు రోజులు ప్రార్థనలు నిర్వహించి గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. ఆదివారం ముగింపు సందర్భంగా భక్తులు సమర్పించిన బియ్యంతో పాశం తయారుచేసి గ్రామ పెద్ద చెరువు మధ్యలో ఉన్న పాశం బండపై పాత్రను బోర్లించి గంగమ్మ తల్లికి వరద పాష సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలతో గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని సకల దేవతల ఆశీస్సులతో సిరి సంపదలు విరాజిల్లాలని గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు గౌరు రాజన్న ఉపాధ్యక్షులు సాయిబాబా కోశాధికారి గాజరి గంగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగారెడ్డి,
వేణు, రవి, మితిష్, హోటల్ రవి, ధర్సింగ్, బాలన్న, గంగం, అశోక్, చాకలి గంగాధర్, నూకల నర్సన్న, సర్పచ్, రాజేందర్, జలంధర్, మహేష్, దత్తు, ముతేన్న, సత్యం పట్టులు పాల్గొన్నారు
