. . . అన్నం తినేది ఎట్లా సారూ ?
. . . నిద్ర మత్తులో విద్యాశాఖ అధికారులు
రుద్రూర్, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పదే పదే చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం తమకేమీలే అన్నచందంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పురుగులతో కూడిన అన్నం ఎట్లా?.. తినాలి సారూ అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకుల నిర్లక్ష్యం వలన విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఎంపిడిఓ బాల గంగాధర్, ఎంపిఓ అరవింద్, సెక్రటరీ ప్రేమ్ దాస్ లతో కలిసి ఆమె సందర్శించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బియ్యం బస్తాలలో, వండిన మధ్యాహ్న భోజనంలో ఒక్కసారిగా పురుగులు కనిపించాయి. వంటకు వినియోగించిన బియ్యం కూడా పురుగులమయంగా ఉన్నాయి. దీంతో మధ్యాహ్న భోజనం నాణ్యత పై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, వారానికి రెండు సార్లు గుడ్లు పెట్టాల్సి ఉండగా, గుడ్లు కూడా పెట్టాడం లేదని, నీళ్లతో కూడిన పప్పు చారు పోస్తున్నారని విద్యార్థులు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, నిద్ర మత్తులో మునిగి తేలుతున్నారని విద్యార్థుల తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరారు.

