- ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ గెలుపు ఖాయమని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక సందర్భంగా సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కార్పొరేషన్ మెజార్టీ స్థానాల్లో బీజేపీయే గెలుస్తోందని జోస్యం చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు అని, బీజేపీ తర్వత స్థానం మజ్లీస్ దేనని అన్నారు. బీజేపీ టికెట్ రాని వారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తే వారు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పని చేసిన వారికి టికెట్ ఇస్తామని ఈ మేరకే స్వయంగా సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తు మొత్తం బీజేపీ పార్టీదేనని కష్టపడ్డ వారికి ఇతర చోట్ల అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్ పదవులను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పంచాయితీల్లోనూ బీజేపీ పట్టునిలుపుకోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, అర్బన్ కు చెందిన మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
1596319854