నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత ప్రజల కోసం, భారత ప్రజలు రాసుకున్న గ్రంధమే భారత రాజ్యాంగమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు,ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్,సహచర న్యాయవాదులు రాజేందర్ రెడ్డి, భాస్కర్ రావు, గంగా ప్రసాద్,మధుసుధన్ రావు, భాస్కర్ పరుచూరి శ్రీధర్ తదితరులతో కలిసి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన న్యాయవాదులనుద్దేశించి ప్రసంగించారు.బ్రిటిష్ వలస పాలన అనంతరం విశాల భారతావనిని పరిపాలించడానికి రాజ్యాంగ అవసరం ఏర్పడిందని, అందుకు అనుగుణంగా రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ఏర్పాటు జరిగిందని ఆయన వివరించారు. అంబేద్కర్ సారథ్యంలో రచన సంఘo భారత రాజ్యాంగాన్ని రచించి 1949,నవంబర్ 26 న ఆమోదించడం జరిందని ఆయన తెలిపారు. 1950,జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చిందని అన్నారు.భారతరాజ్యాంగం భారత ప్రజల ఆత్మ అని, అది ప్రజలను జీవన ప్రమాణాలను నిర్ణస్తుందని అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతు ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశం తనకుతానుగా సమర్పించుకున్న రోజే ప్రజలకు సర్వహక్కులు లభించాయని తెలిపారు. దేశ పార్లమెంట్ కు ప్రజాప్రతినిధులను, రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకునే పార్లమెంటరీ సంప్రదాయం నిర్మించుకున్నామని ఆయన పేర్కొన్నారు.ప్రజలే ప్రభువులుగా ప్రభుత్వాలను నడిపించే, ఎన్నుకునే విధానంలో ప్రజలే విధానకర్తలుగా మారిన రోజు అని ఆయన అభివర్ణించారు. బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు రాజ్యాంగ ఫలాలు ప్రగతి పథకాల రూపంలో ప్రజల వద్దకు చేరుతున్నాయని విశదీకరించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. విద్యార్థులు విద్య విషయాలతో పాటు రాజ్యాంగపు విషయాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు.న్యాయవాదులు భాస్కర్, శ్రీధర్, ఆశ నారాయణ లు మాట్లాడుతు రాజ్యాంగమనే సౌధపు నీడలో ప్రతి పౌరుడు సరక్షితంగా ఉన్నారని, హక్కులు హరించబడితే రాజ్యాంగమే రక్షణ కల్పిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు బాబురావు,యునస్ ఖాన్ వినాయక్, రత్నాకర్ రెడ్డి, మద్దెపల్లి శంకర్, ఇంతియాజ్,జూనైద్ అలీ, జైపాల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

