పదిలో వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : వేసవి కాలం దృష్ట్యా మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం గాంధారి మండలం పేట్ సంగం గ్రామంలో రోడ్డుకిరువైపులా ఉన్న మొక్కలకు కలెక్టర్ నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉష్ణోగ్రత పెరుగుతున్న క్రమంలో మొక్కలకు ప్రతి రోజూ నీళ్లు పోయాలని, మొక్కలను సంరక్షించాలని తెలిపారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలను నాటాలని సూచించారు. సెగ్రిగేషన్ షెడ్ నిర్వహణ సక్రమంగా లేదని, ఇంటింటి తడి పొడి చెత్త సేకరణ నిర్వహించాలని, వర్మి కంపోస్టు తయారు చేయాలని తెలిపారు. చెత్తను దూర ప్రాంతంలో వేయడం పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైకుంఠ ధామంలో మొక్కలను పెంచాలని సూచించారు. అనంతరం నర్సరీ లో మొక్కల పెంపకం ను పరిశీలించారు.
ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టు లలో విద్యార్థులచే బోర్డుపై జవాబులు రాబట్టిన కలెక్టర్..
పేట్ సంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సన్నద్ధత పై హెడ్ మాస్టర్, టీచర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సబ్జెక్టు లో వారీగా రివిజన్ చేయించాలని తెలిపారు. అనంతరం ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ పాఠాలలోని ప్రశ్నలను అడిగి బోర్డులపై రాయించారు. విద్యార్థుల్లో దాగి వున్న ప్రతిభను కలెక్టర్ రాబట్టారు. పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి లోనుకాకుండా శ్రద్ధతో చదవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. పాఠశాలకు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయాలని ఏఈఈని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, మండల ప్రత్యేక అధికారిని లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

