- వాట్సప్ గ్రూపులలో వైరల్ కావడంతో తిరిగి అప్పగింత
బతుకమ్మ, భిక్కనూరు : పంట చేనులో ఉన్న యూరియా బస్తా ను రైతు కళ్లు కప్పి ఇద్దరు యువకులు ఎత్తుకెళ్లిన విచిత్రమైన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుడు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తక్కల్ల గంగారెడ్డి తన వ్యవసాయ పొలంలోని మొక్కజొన్న పంటకు వేయడానికి యూరియా బస్తాలను తన వ్యవసాయ బావి వద్ద ఉంచాడు. ఆ బస్తాలను రైతుకు తెలియకుండా అతని కళ్ళుగప్పి ద్విచక్ర వాహనంపై మొక్కజొన్న కర్రలను పెట్టుకుని దాని కింద యూరియా బస్తాను వేసుకొని అపహరించారు. యూరియా బస్తా కోసం వెతకగా పక్కన వ్యవసాయ బావి వారు ఇద్దరు యువకులు టోల్ ప్లాజా వైపు తీసుకెళ్లారని చెప్పడంతో టోల్ ప్లాజా లో సిసి కెమెరాలు రికార్డు అయిన దానిని ఫోటో తీసి వాట్సప్ గ్రూపులలో రైతు వైరల్ చేశాడు. దీంతో వైరల్ చేసిన ఫోటోను చూసిన ఇద్దరు యువకులు తిరిగి రైతుకు యూరియా బస్సులను అప్పగించి క్షమాపణ కోరారు.
