- ధర్మోరాలో ఘటన
- హత్యకు గురైన వ్యక్తి పాత నేరస్తుడు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బలవంతమైన సర్పం చలిచీమల చేతచిక్కి చావదే సుమతి. బద్దెన తన సుమతి శతకంలో బలవంతమైన పాము చలిచీమల చేతచిక్కి చనిపోయిన విధానాన్ని చెప్పిన పద్యం ఇప్పటికి చాలా మంది వివిధ రూపాలుగా, ఉదాహరణగా తీసుకుంటారు. అచ్చం సుమతి శతకంలో బద్దెన చెప్పిన విధంగానే బలవంతుడైన వ్యక్తి ఒక సామూహం చేతిలో చిక్కి హతుడయ్యాడు. అతనితో సావాసం చేసిన అమాయకుడైన వ్యక్తి కూడా సామూహిక దాడిలో హతుడయ్యాడు.
- ధర్మోరాలో డబుల్ మర్డర్ ..
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరా (ఏ) గ్రామంలో ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్ కు చెందిన జిలకర ప్రసాద్(35) అతని స్నేహితుడు లోకండే అఖిల్ లు హత్యకు గురయ్యారు. ధర్మోరాలో తాను సహజీవనం చేస్తున్న మహిళ ఇంటికి వెళ్లిన జిలకర ప్రసాద్ అతనికి తోడు వెళ్లిన అఖిల్ ను స్థానికులు రాడ్ లతో, గడుగొయ్యలతో కొట్టి హత్య చేశారు. రెండు రోజుల క్రితం జిలకర ప్రసాద్ స్థానికంగా ధర్మోరాలో ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులతో గొడవ పడ్డాడు. నేర ప్రవృత్తి కలిగిన జిలకర ప్రసాద్ తనతో పెట్టుకుంటే చంపుతానని బెదిరించినట్లు తెలిసింది. ఇదే విషయంలో ఆదివారం రాత్రి ధర్మోరాకు వెళ్లి రెండు రోజుల క్రితం తాను గొడవపడ్డ వారితో తగువు పెట్టుకున్నాడు. ఇతని నేరచరిత్ర తెలిసిన ఆ కుటుంబంతో పాటు కులపెద్దలు గొడవను సద్దుమనిగించేందుకు యత్నించగా జిలకర ప్రసాద్ ఎదురు తిరిగాడు. జిలకర ప్రసాద్ దాడిని ఎదుర్కొనేందుకు ఆ కుటుంబం సామూహిక దాడికి దిగింది. ఈ ఘటనలో దొరికిన కర్రలు, రాడ్ లతో జిలకర ప్రసాద్ పై దాడి చేశారు. వారిని అడ్డుకునేందుకు యత్నించిన అఖిల్ పై దాడి చేశారు. ఈ దాడిలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా కొనఊపిరితో ఉన్న అఖిల్ ను జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

- జిలకర ప్రసాద్ ఆధ్యాంతం నేర చరిత్రే ..
మాక్లూర్ మండలం ధర్మోరాలో సామూహిక దాడిలో హతుడైన జిలకర ప్రసాద్ ది ఆధ్యాంతం నేరచరిత్రనే. నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్ కు చెందిన జిలకర ప్రసాద్ చిన్నప్పటి నుంచి దొంగతనాలకు అలవాటుపడి చోరిలకు పాల్పడేవాడు. స్థానికంగా నగరంలోని 3వ టౌన్ పరిధిలోని ప్రసాద్ పై ఏడు చోరి కేసులున్నాయి. గంజాయి విక్రయించినట్లు ఎన్ డీపీఎస్ కేసులు కూడా ఉన్నాయి. చోరికి వెళ్లినప్పుడు అడ్డుపడిన వ్యక్తిని హత్య చేసిన కేసు కూడా ప్రసాద్ పై ఉంది. ప్రసాద్ గతంలో జైళ్లో అండర్ డ్రయల్ ఖైదీగా ఉండి ఆసుపత్రిలో చికిత్సకు వచ్చి పరారీ అయ్యాడు. ఎస్కార్ట్ కళ్ళుగప్పి పరారీ కావడమే కాకుండా ఏకంగా తుపాకిని ఎత్తుకెళ్లడం ఆనాడు కలకలం రేపింది. తర్వాత పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లివచ్చిన తర్వాత కూడా ప్రసాద్ నేర స్వభావాన్ని మార్చుకోలేదు. అతడు స్థానికంగా ఆవారా తిరిగే వారిని పొగేసి దౌర్జాన్యానికి పాల్పడి డబ్బులకు లాక్కునేవాడు.

- సావాసదోషంతో హతమైన అమాయకుడు..
చెడు స్నేహాలు, వ్యసనాలు అప్పుడప్పుడు అమాయకుల ప్రాణాలను తోడేస్తాయి. అచ్చంగా అలానే నవయువకుడు నేర ప్రవ`త్తి కలిగిన వ్యక్తితో చేసిన స్నేహం అతని ప్రాణాలను తోడేసింది. తనకు సంబంధం లేని విషయమైనప్పటికీ అతనితో వెళ్లినందుకు హతమయ్యాడు. మాక్లూర్ మండలం ధర్మోరాలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో పాత నేరస్తుడు జిలకర ప్రసాద్ తో పాటు హతమైన లోకండే అఖిల్ జులాయిగా తిరుగుతూ అతనితో స్నేహం చేసినందుకు ప్రాణాలను కోల్పోయాడు. ధర్మారోలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో ప్రసాద్ తో ఉన్నందుకే హతమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జిలకర ప్రసాద్ చనిపోతే అతని కుటుంబ సభ్యులెవ్వరు అంత్యక్రియలు చేసేందుకు చివరకు శవాన్ని కూడా తీసుకెళ్లేందుకు ఇష్టపడలేదు. కానీ అమాయకుడైన అఖిల్ అతనితో కలిసి వెళ్లినందుకు హతమవడంతో కుటుంబ సభ్యులు, కాలనీవాసులు అయ్యోపాపం అంటూ కన్నీటిపర్వంతమయ్యారు.

