- ఎంపీ అరవింద్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
- నీలకంఠేశ్వర ఆలయంలో పూజలు
- రక్తదానాలు చేసిన అభిమానులు
- పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు నోటు బుక్ ల పంపిణీ
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ 50వ పుట్టిన రోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పుట్టినరోజు వేడుకలతో పాటు బూత్ స్థాయి సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నిజామాబాద్ కు వచ్చిన రామచంద్రరావుకు ఆయనతో పాటే హైదరాబాద్ నుంచి వచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఇందల్వాయి టోల్ గేట్ వద్ద పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇందల్వాయి టోల్ గేట్ నుంచి నిజామాబాద్ నీలకంఠేశ్వర ఆలయం వరకు 250 కార్లతో స్వాగతం పలికారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేయడాలు, శాలువాలు, బొకేలతో సన్మానాలకు దూరంగా ఉండాలని ఇది వరకే తన అభిమానులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లాకు తొలిసారి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి ధర్మపురి అరవింద్ నగరంలోని ప్రముఖ నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీతో పాటు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డిలతో పాటు స్రవంతిరెడ్డి, ఇందూర్ సుధా, కల్పే రాజేంధర్ (చిరు), గొండల సురేష్ బాబు, రామచంద్రరావు (అన్నసేట్), బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ, పుట్ట వీరేంధర్ తదితరులున్నారు. నీలకంఠేశ్వర ఆలయం నుంచి శ్రీరామ గార్డెన్ వరకు బీజేపీ నాయకులు, యువ మోర్చ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు.

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా బూత్ స్థాయి కార్యకర్తలకు 76 మందికి 25 లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ధర్మపురి అరవింద్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఆయన అభిమానులు, బీజేవైఎం నాయకులు 79 మంది రక్తదానం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో అరవింద్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలని ముక్తకంఠంతో నినాదాలు చేశారు. అరవింద్ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలన్న సంకల్పం మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఆయన పుట్టినరోజు వేడుకలకు పూలు, బొకేలు, శాలువాలతో సన్మానం చేయకుండా వచ్చిన నోటు బుక్ లను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

