బతుకమ్మ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలు అతిక్రమించి రాత్రివేళ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన ముగ్గురికి జైలు శిక్ష విధించారు. బోధన్ పట్టణంలో రాత్రి 10:30 తర్వాత షాపులు తెరిచి ఉంచిన యజమానులను సోమవారం రెండవ తరగతి మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ముందు హాజరుపరిచి శిక్షలు విధించారు. రంగర్ గల్లీకి చెందిన పవన్ చారి హనుమాన్ మందిరం వద్ద ఉన్న తన బంగారం షాపును, అలాగే షక్కర్ నగర్ కు చెందిన షేక్ యాకుబ్ తన మిల్క్ డైరీని రాత్రిపూట తెరిచి ఉంచినందుకు ఒక్కరోజు జైలు శిక్ష విధించారు. సాత్పుల్ వద్ద స్ప్రింగ్ బేకరీ యజమాని షేక్ హుస్సేన్ కు రెండు రోజుల జైలు శిక్ష విధించబడింది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రాత్రి 10:30 గంటల తర్వాత హోటల్స్, దాబాలు, ఇతర వాణిజ్య సంస్థలు మూసివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ స్పష్టం చేశారు.
