హైదరాబాద్, బతుకమ్మ :
కామారెడ్డి పట్టణంలో ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా 2023 సంవత్సరంలో నిర్వహించిన ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో నమోదైన మూడు క్రిమినల్ కేసులను హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ప్రజల ఆస్తులు, రైతుల భూములు, పట్టణ వాసుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహించిన ధర్నాలు, బతుకమ్మ కార్యక్రమాలు, వంటావార్పు, ర్యాలీలు తదితర ప్రజాస్వామ్య నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి పాల్గొని ప్రజలకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనపై నమోదైన మూడు కేసులను కోర్టు సమగ్రంగా పరిశీలించి, కేసుల్లో అభియోగాలను కొనసాగించేందుకు తగిన ఆధారాలు లేవని నిర్ధారించి వాటిని కొట్టివేసినట్లు న్యాయవాదులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్లు ఎల్. ప్రభాకర్ రెడ్డి, వై. రాములు, టి.ఉదయ్ రాజ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొనడం నేరంగా పరిగణించలేమని, న్యాయస్థానం వాస్తవాలను పరిశీలించి న్యాయం చేసినట్లు తెలిపారు.

