- ఆధ్యాతిక వక్త శ్రీ రాఘవేంద్రస్వామి
వేల్పూర్, బతుకమ్మ : నిజ జీవితంలో సత్ గ్రంథాలను చదివిన, విన్నటువంటి వారు సత్ పురుషులు అవుతారని ఆధ్యాతిక వక్త శ్రీ రాఘవేంద్రస్వామి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ గోవిందా సాయి యోగాశ్రమంలో నిర్వహిస్తున్న సప్త భజన కార్యక్రమం లో భాగంగా స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. సత్సంగాల్లో సత్ పురుషుల వాఖ్యాలు విన్న కూడా సత్ భావన కలిగి సామాన్యులు కూడా సత్ పురుషులు అవుతారని అన్నారు. భక్తి ఒక పవిత్రమైన భావన అని, దైవం పట్ల భక్తి భావన కలవారిని భక్తులు అంటారని తెలిపారు. భక్తి యోగం గురించి భగవద్గీతలో వివరించి ఉందని,ఆ ప్రకారంగా భక్తియోగం వేదాంతల సారమని తెలుస్తోందన్నారు. భగవంతుని చేరుకోవడానికి నారద భక్తి సూత్రాలు, పలు రకాల భక్తి విధాల గురించి పేర్కొన్నారు.బమ్మెర పోతనామాత్యుడు రచించిన భాగవతం ప్రకారం భగవంతుని చేరుకోవడానికి నవవిధభక్తి మార్గాలు ఉన్నాయని, నవ అనగా 9 రకాలైన భక్తి మార్గాలు భాగవతం లోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉందన్నారు. “శ్రవణం కీర్తనం విష్ణో: స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం! సత్యమాత్మ నివేదనం” అంటారన్నారు. శ్రవణం సులభమైన మార్గం. మహిమలను నిరంతరం కీర్తించుట కీర్తనా భక్తి విధానం. భగవంతుని లీలలను మనసులో నిలుపుకొని ఆ లీలలను నిరంతరం స్మరించడమే స్మరణ భక్తి విధానమని,భగవంతుని సర్వావయవాలలో ప్రధానమైనది పాదాలు అని రాఘవేంద్ర స్వామీజీ తెలిపారు. ఇట్టి సత్కార్యములో గోవిందగిరి స్వామి శిష్యులు, సాయి సేవకులు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తజనులు తదితరులు పాల్గొన్నారు.
