- వారు రాకపోతే వీరిని పంపించాల్సిందే
- రెవిన్యూ ఉద్యోగుల డిమాండ్
- స్థానికేతరులకు తహసిల్దార్లుగా పోస్టింగ్స్
నిజామాబాద్, బతుకమ్మ: ఎన్నికల్లో వెళ్ళిన వారిని తిరిగి వెనక్కి పంపించేందుకు స్థానికత అడ్డు వస్తే, లోకల్లో ఉన్నవారిని వేరే జిల్లాలకు పంపించాలనే డిమాండ్ తహసిల్దార్ల నుంచి వస్తోంది. మమ్మల్ని వెనక్కి రప్పిస్తారా, లేదంటే స్థానికంగా ఉన్నోళ్ళను పంపిస్తారా అనే ఘాటు వ్యాఖ్యాలను సందిస్తున్నారు. ఇటీవల కొందరు జిల్లాలో పని చేసినప్పటికీ, ఇతర జిల్లాలకు చెందినవారు కావడంతో ఎన్నికల్లో వెళ్లినవారికి తిరిగి ఇదే జిల్లాలో పోస్టింగ్ లు ఇచ్చారు.
- ఎన్నికల్లో వెళ్ళినవారు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాను వీడిన తహసిల్దారులకు వెనువెంటనే ఎంపి ఎన్నికలు అడ్డు వచ్చాయి. దీంతో వారి రాకకు అవాంతరాలు ఎదురయ్యాయి. కోడ్ ముగిసినప్పటి నుంచి జిల్లాను వీడిన వారిని తిరిగి పంపించాలని రెవిన్యూ సంఘ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాయకుల మాటలను పెడ చెవిన పెడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో రెవిన్యూ శాఖలో రెండు గ్రూప్ లు ఏర్పడ్డాయి. వారి ఆదిపత్య పోరువల్ల బదిలీలు గాకుండా పోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలను వీడిన వారు వెనక్కి రాలేక పోతున్నారని స్పష్టమవుతోంది.
- ఉన్నోళ్ళను పంపించేయండి..
ఎన్నికల విధులకు వెళ్ళకుండా ఉండేందుకు కుంటిసాకులు చెప్పి తప్పించుకున్న వారు జిల్లా కేంద్రంలో ఉన్నారు. అలాంటి తహసిల్దార్లకు స్థానికత వర్తించదా అనే ప్రశ్నలు రెవిన్యూ వర్గాల నుంచి వస్తున్నాయి. సంఘం పేరుతో నాయకుడు, కీలక పోస్టులో ఉన్న అధికారి సతీమణి, కలెక్టరేట్ లో మరొకరికి స్థానికత వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. నిర్వాహక పోస్టులో లేనందున వారికి మినహాయింపు ఉంటుందని చెప్తే మాకు అలాంటి వాటిల్లోనే (సైడ్ పోస్ట్) ఉంచాలనే డిమాండ్ జిల్లా నుంచి వెళ్ళిన తహసిల్దారుల నుంచి వస్తోంది.
- పలువురు తహసిల్దార్ లకు పోస్టింగ్ లు..
ఎన్నికల ముందు జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాలకు బదిలీ పై వెళ్ళి ఇటీవల పూర్వ జిల్లాకు బదిలీపై వచ్చిన (స్థానికేతరులు) పలువురు తహసిల్దార్లకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోస్టింగ్ లు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు పని చేసిన నియోజకవర్గంలో గాకుండా వేరే నియోజకవర్గంలో పోస్టింగ్లు ఇచ్చారు. ఎల్.వీర్ సింగ్ కు చందూర్, సతీష్ రెడ్డికి డిచ్ పల్లి, ప్రసాద్ కు కమ్మర్పల్లి, శాంతకు ధర్పల్లి, శ్రీనివాస్ కు వేల్పూర్, ముంతాజ్బుద్దీన్ కు ముప్కాల్, వెంకటేశంకు ఆర్మూర్ అర్దిఒ కార్యాలయం, ధన్వాల్ కు కలెక్టరేట్ లో సూపరిండెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
