
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారిని త్యాగాలను స్మరించుకోవడమంటే వారిని గౌరవించుకోవడమేనని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీసు అమరవీరు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించగా అదనపు కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవు తుండడంలో పోలీసులు కృషి దాగి ఉందని అన్నారు. మన పోలీసు వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. అదనపు పోలీస్ కమిషనర్ బి కోటేశ్వరరావు, అదనపుకలెక్టర్ పోలీసు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అమరుల కుటుంబాలను గౌరవిస్తూ గిఫ్ట్ ప్యాక్ లను అందజేశారు. లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ జి బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్, సీసీఆర్ బీ, సీసీఎస్, ఆర్మ్డ్ రిజర్వు ఏసీపీలు శ్రీనివాస రావు, రవీందర్ రెడ్డి, నాగేంద్రచారి, నాగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు, రిజర్వు ఇన్ స్పెక్టర్స్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా, పోలీసు అమరుల కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.


