. . . టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం
కామారెడ్డి, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి మండలం గర్గుల్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మూడు రోజుల హిందీ భాషా శిక్షణ కేంద్రంలో భోజన విరామ సమయంలో హిందీ భాషా పండితులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం మాట్లాడుతూ 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 317 జీవో ప్రభావిత ఉపాధ్యాయులు తమ సొంత జిల్లాలకు వెళ్లేలా తక్షణమే మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హిందీ భాషా టెట్ పరీక్షలో సంబంధం లేని సోషల్ సబ్జెక్ట్ ను చేర్చడం వల్ల హిందీ భాషా పండితులు అర్హత సాధించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పాఠశాలలను ఎత్తివేస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఉపాధ్యాయుల్లో, విద్యారంగంలో ఆందోళనకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం పునఃసమీక్షించి విద్యారంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని సూచించారు. టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సదాశివనగర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ లియాస్, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, గాంధారి మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, రాష్ట్రీయ పండిత పరిషత్ కామారెడ్డి జిల్లా బాధ్యుడు వంశీధర్, హిందీ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఇంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సహీంద్రనాథ్తో పాటు ఏడు మండలాలకు చెందిన హిందీ భాషా పండితులు పాల్గొన్నారు.
