- దాబాలో ఆహార పదార్థాలపై అధిక వసూళ్లు
రుద్రూర్ (వర్ని), బతుకమ్మ: పేరుకే ‘ఫ్యామిలీ’ దాబా.. లోపలంతా బార్ల తీరే.. వర్ని మండల కేంద్రంలోని వైన్స్ ప్రక్కన గల ఓ దాబాలో ఆహార పదార్థాల పై దాబా యజమానులు అధిక ధరలు విక్రయస్తూ ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు. దాబాలో అనుమతులు లేకుండా కూడా మద్యం సిట్టింగ్ లు ఏర్పాటు చేసి, దాబాలో ఉన్న ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక గుడ్డు 6 రూపాయలు ఉంటే ఆమ్లెట్ కు 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. దాబాల్లో మద్యం తాగేందుకు వచ్చిన వారికి మద్యం బయట నుంచి తీసుకురావాలని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దాంతో వారు దాబాలకు వస్తూనే మద్యం వెంట తెచ్చుకొని అర్ధరాత్రి వరకు తాగుతున్నారు. ఎవరైనా మద్యం తెచ్చుకోకుండా దాబాకు వెళితే సిబ్బంది ప్రత్యేకంగా రేటు నిర్ణయించి మద్యం సరఫరా చేస్తున్నారు. చాలా దాబాలు పేరుకు ఫ్యామిలీ దాబాలని బయట బోర్డులు పెట్టి లోపల మాత్రం అనధికారిక బార్లను నిర్వహిస్తున్నారు. దాబాలో ఆహార పదార్థాల పై అధిక ధరలు విక్రయిస్తున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దాబాలలో ఆహార పదార్థాల పై అధిక ధరలకు విక్రయిస్తున్న దాబా యజమానుల పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
